ఇరాన్ చర్చలకు వచ్చినా, రాకున్నా నేను లెక్క చేయను: డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో, ఇరాన్ తిరిగి చర్చలకు వచ్చినా, రాకపోయినా తనకు ఎలాంటి పట్టింపు లేదని స్పష్టం చేశారు. ఫ్లోరిడా పర్యటన ముగించుకుని మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

చర్చల సందర్భంగా ఇరాన్‌కు అణ్వాయుధంపై ఉన్న ఆసక్తి మరోసారి బయటపడిందని ట్రంప్ ఆరోపించారు. "వారికి అణ్వాయుధం కావాలట. ఆ విషయాన్ని వాళ్లు ఆ రాత్రి చర్చల్లో స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండటానికి వీల్లేదు" అని ఆయన గట్టిగా చెప్పారు. చర్చలు జరుగుతున్నప్పుడే ట్రంప్.. ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా అమెరికాకే విజయమని వ్యాఖ్యానించడం గమనార్హం.

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో వారాంతంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య కాల్పుల విరమణపై ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొంది. అయితే, దాదాపు 21 గంటల పాటు జరిగిన ఈ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడానికి నిరాకరించడమే చర్చల వైఫల్యానికి కారణమని అమెరికా వర్గాలు తెలిపాయి.

చర్చలు విఫలమైన వెంటనే, అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి నుంచి రాకపోకలు సాగించే ఇరాన్ నౌకలపై నౌకా దిగ్బంధనం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 22తో ముగియనుంది.

Donald Trump
Iran
US Iran relations
nuclear weapon
Pakistan
Hormuz Strait
JD Vance
Iran talks
America

More Telugu News